ఇందిరా నగర్ రామాలయ పునః ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
March 21, 2026
Prajagalam News
* ఈ నెల 23 నుండి ఐదు రోజుల పాటు వైభవంగా వేడుకలు
* పునర్నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు
* భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు.
తాండూరు :పట్టణంలోని ఇందిరా నగర్లో నూతనంగా పునర్నిర్మించిన రామాలయం పునః ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 23వ తేదీ నుండి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. భక్తులందరి సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్మితమైన ఈ ఏకైక రామాలయ వేడుకల వివరాలను ఆలయ ప్రతినిధులు వెల్లడించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ నెల 23వ తేదీన ఉదయం 6 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం ఉదయం 7 గంటలకు భద్రప్ప హనుమాన్ దేవాలయం నుండి నూతన రామాలయం వరకు మూల విరాట్ల శోభాయాత్ర నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ యాత్ర భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, మర్రిచెట్టు, వివిహెచ్ఎస్, శివాజీ చౌక్ మరియు పాండురంగ దేవాలయం మీదుగా సాగి ఆలయానికి చేరుకుంటుంది పేర్కొన్నారు. అదేవిదంగా మార్చి 24వ తేదీ ఆలయంలో శాస్త్రోక్తంగా వివిధ హోమాలు, పూజా కార్యక్రమాలు మార్చి 25 వ తేదీ అత్యంత కీలకమైన విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో పాటు సీతారామచంద్ర మూర్తుల మరియు వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠాపన కార్యక్రమం మార్చి 26వ తేదీ కళ్యాణోత్సవానికి సన్నాహక కార్యక్రమంగా ఎదుర్కోలు ఉత్సవం మార్చి 27వ తేదీ లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర మూర్తుల కళ్యాణోత్సవంతో వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు.ఈ ఐదు రోజుల ఆధ్యాత్మిక వేడుకల్లో తాండూరు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, భజన కీర్తనలతో ఈ మహత్కార్యాన్ని దిగ్విజయం చేయాలని ఈ భగవత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.