schedule Wednesday, September 02, 2026

12వ వార్డులో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం

calendar_today August 3, 2026
person Prajagalam News
12వ వార్డులో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం
   

• రూ.5 లక్షలతో ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు

• భూమిపూజ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి

(తాండూర్)   పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు వార్డుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా తాండూర్ మున్సిపాలిటీ చర్యలు కొనసాగుతున్నాయి. తాండూర్ ఎమ్మెల్యే  బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి 12వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే నిజమైన సంపద అని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు. యువతతో పాటు మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా సులభంగా వ్యాయామం చేసేందుకు వీలుగా ఓపెన్ జిమ్ పార్క్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడకతో పాటు వ్యాయామం చేసేలా ఈ పార్క్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకువస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టి తాండూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం ప్రజాప్రతినిధులు, స్థానికులు కలిసి అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, తాండూర్ టౌన్ అధ్యక్షులు  నాగరాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు 12వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.